ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021

666

ఐపీఎల్ 14వ సీజ‌న్‌కు సంబంధించిన తేదీలు ఖ‌రార‌య్యాయి. ఈ టోర్నీ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కానుంది.

ఫైన‌ల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అయితే ఇది ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆమోదం పొందాల్సి ఉంది.

52 రోజుల పాటు నిర్వ‌హించే ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు సమాచారం.

టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే బీసీసీఐ రిలీజ్ చేయనుంది.

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020‌ను యూఏఈలో నిర్వహించిన విష‌యం తెలిసిందే.

ఈసారి మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వచ్చేవారం ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో పాటు వేదిక‌ల‌ను కూడా ఖ‌రారు చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆరు వేదికలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత, ముంబైలు బీసీసీఐ జాబితాలో ఉన్నాయి.

అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.

దీంతో ముంబైలో మ్యాచ్‌లు జరగడం కష్టమే. ముంబై స్థానంలో హైద‌రాబాద్‌ను చేర్చే అవకాశాలు లేకపోలేదు.

అయితే మ్యాచ్‌ వేదికలపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.

ఐపీఎల్ 2020కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్య‌మిచ్చింది. దుబాయ్, అబుదాబి, షార్జాలలో ఈ మ్యాచ్‌లు జరిగాయి.

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జ‌రిగింది.

ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు విజేత‌గా నిలిచి ఐదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఇటీవల ఐపీఎల్ 2021 వేలం జ‌రిగింది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్ప‌టికే చెన్నై చేరుకుంది.

బీసీసీఐ జాబితాలో త‌మ సొంత మైదానాలు లేక‌పోవ‌డంపై సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

మూడు ఫ్రాంఛైజీలు తమ సొంత మైదానాల్లో మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాశాయి.

వేదికల జాబితాలో మొహాలీని కూడా చేర్చాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ బీసీసీఐకి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.

లీగ్ మ్యాచులను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌డానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కూడా బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.