రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

437

టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు.

టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శుక్ర‌వారం 49 పరుగులు

చేశాడు. దీంతో ఓపెనర్‌గా 1,000 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. 2019 వరకూ మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ ఆ తర్వాత ఓపెనర్‌గా మారాడు.

కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం.

ఆసియా ఓపెనర్లలో ఇప్పటి వరకూ ఎవరూ ఇంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1,000 పరుగులు చేయలేదు. మయాంక్ అగర్వాల్ 19 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.

2019లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభ‌మైన త‌ర్వాత 1,000 పరుగుల మార్క్‌ని అందుకున్న ఏకైక ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు.

రోహిత్ శర్మ తర్వాత డేవిడ్ వార్నర్ (948 రన్స్), డీన్ ఎల్గర్ (848), డొమినిక్ సిబ్లీ (841), మయాంక్ అగర్వాల్ (810) టాప్-5లో ఉన్నారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే టాప్-10లో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ 341 పరుగులు చేయగా జో రూట్ 338 బెన్‌స్టోక్స్ 201 పరుగులతో నిలిచారు.