వెండితెర ఫై 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న శృతి హాస‌న్

195

క‌మ‌ల్ హాసన్ కూతురు శృతి హాస‌న్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఫుల్‌గా 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. క‌మ‌ల్ హాసన్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఈ అమ్మ‌డు న‌టిగానే కాక సింగ‌ర్‌గా, రైట‌ర్‌గా ప‌లు విభాగాల‌లో త‌న స‌త్తా చాటింది.శృతి హాస‌న్ 2009 జూలై 24న విడుద‌లైన హిందీ చిత్రం ల‌క్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది . తెలుగులో గ‌బ్బ‌ర్ సింగ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ‘లాభం’, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయ‌నుంది. వాటితో పాటు అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర ఎంపికైంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు.

కెరీర్‌లో 10 ఏళ్ళు పూర్తి చేసుకోవ‌డంతో శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. వెండితెర ఫై న‌టిగా ప‌దేళ్ళు పూర్తి చేసుకున్నాను. ఇక్క‌డ నేను ఎంతో నేర్చుకున్నాను ఇందుకు ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు. నన్ను న‌మ్మిన వాళ్ళ కోసం బాగా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని ప్ర‌మాణం చేస్తున్నాను. ఈ బిజినెస్ అనేది ఒక కుటుంబం అని తెలుసుకున్నాను. ఇందులో మంచి ఉంటుంది,చెడు ఉంటుంది. కాని ఎక్కువ శాతం ఎదుగుద‌ల‌, ఆశ‌, త‌ప‌న‌ అనేవి ఉంటాయి. నేను న‌టిగానే కాదు మ‌నిషిగాను చాలా మారాను. సంవ‌త్స‌రం గ్యాప్ తీసుకున్న నేను నా వృత్తితో పాటు నా వ్య‌క్తిగ‌త ల‌క్ష్యాల‌ని స‌రైన దారిలో పెట్టుకోవ‌డం చాలా అవ‌స‌రం. నా ప్ర‌యాణంలో న‌న్ను ప్రేమిస్తూ, నాకు అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్కరికి నా హృద‌య పూర్వ‌క‌ ధ‌న్య‌వాదాలు అని శృతి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ ద్వారా తెలిపింది.