“క్రాక్” వివాదం… మిస్‌ కమ్యూనికేషన్ అంటున్న నిర్మాత

161
Krack

మాస్ మహారాజా రవితేజ నటించిన “క్రాక్” చిత్రం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం “క్రాక్”.

ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2021లో విడుదలైన మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు అందుకుని భారీ హిట్ గా నిలిచింది.

అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత ఠాగూర్ మధుపై ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు.

తనకు నిర్మాత మధు పన్నెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ ఇవ్వాల్సి ఉందని, కానీ ఇవ్వడం లేదంటూ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు.

దీనికి దర్శకుల సంఘం వివరణ కోరుతూ తెలుగు నిర్మాతల మండలికి లేఖ రాశారు.

ఈ ఫిర్యాదుపై నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్‌ నిర్మాత మధుని వివరణ అడిగారు. అలాగే సమస్యను సాల్వ్‌ చేయడానికి కె.ఎల్‌.నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ వివాదం గురించి ‘క్రాక్‌’ నిర్మాత ఠాగూర్‌ మధు మాట్లాడుతూ “మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగానే ఈ వివాదం వచ్చింది. చాలా శ్రమకోర్చి క్రాక్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం.

కోవిడ్‌ సమయంలో బడ్జెట్‌ పెరిగినా సినిమాను పూర్తి చేశాం.

త్వరలోనే ఈ విషయంపై కమిటీతో మాట్లాడుతాను. సమస్యను నిర్మాతల మండలి సాల్వ్‌ చేస్తుందని భావిస్తున్నాను.

కొన్ని కారణాలతో ఇప్పుడు ఆ వివరాలను చెప్పలేను. త్వరలోనే వివరించే ప్రయత్నం చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.