అమ్మ మాట వినాల్సింది…

246

అమ్మ మాట వినాల్సింది…

త‌ల్లిదండ్రులు ఎవ‌రైనా బిడ్డ‌ల క్షేమం కోరి వారిని ముందుకు న‌డిపిస్తారు. పెద్ద‌య్యాక‌ సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తారు. ఒక్కోసారి తండ్రి మాట నిజ‌మ‌వుతుంది.. మ‌రోసారి త‌ల్లి మాట నిజ‌మ‌వుతుంది.

ఏదిఏమైనా ఎవ‌రి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ఆ దేవుడికి త‌ప్ప మ‌రెవ్వ‌రికీ తెలీదు. శుక్ర‌వారం (18-2-2021) జ‌రిగిన వేలం పాట‌లో జ‌ట్ల య‌జ‌మానులు బౌల‌ర్ల వైపే మొగ్గు చూపారు.

వారిని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశారు. దీంతో టీమిండియా వికెట్‌కీప‌ర్‌/బ‌్యాట్స్‌మ‌న్ దినేశ్ కార్తీక్ కాస్త నిరుత్సాహ‌ప‌డ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 సీజన్‌ వేలం అంచనాలకు అందని రీతిలో సాగింది.

అనూహ్య జాక్‌పాట్‌లు.. అంతకుమించిన షాక్‌లతో ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపాయి.

దీంతో వారికి భారీ ధర పలికింది. పేసర్లు క్రిస్ మోరీస్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. జై రిచర్డ్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది.

ఫాస్ట్ బౌలర్ కైల్‌ జెమీసన్‌కు రూ.15కోట్లు దక్కాయి. ఇక ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయారు.

అమ్మ మాట వినాల్సింది:

ఈ వేలం పాటపై టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్‌ కార్తిక్‌ సరదాగా స్పందించాడు. అమ్మ చెప్పిన మాట వినాల్సిందన్నాడు.

అమ్మ మాట వింటే ఇప్పుడు ఐపీఎల్‌ 2021 వేలంలో తాను కింగ్ అయ్యవాడినని అభిప్రాయపడ్డాడు. ‘నువ్వు ఫాస్ట్‌ బౌలర్‌వి కావాలని మా అమ్మ నాకు చెపుతూ ఉండేది.

కానీ నేను మా నాన్న మాట విన్నాను. వికెట్‌ కీపర్,‌ బ్యాట్స్‌మన్‌ అయ్యాను. మా ఇంట్లో అమ్మకు ముందు చూపు ఎక్కువ. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది’ అని కార్తీక్ ట్వీట్ చేశాడు.

అమ్మ చెప్పినట్లుగా ఫాస్ట్ ‌బౌలర్‌ అయ్యుంటే.. తనకు కూడా భారీ ధర వచ్చేదని కార్తిక్‌ అంటున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు దినేశ్ ‌కార్తిక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు. జట్టును గెలిపించ‌లేకపోవడంతో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ బాధ్యతలను ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ తీసుకున్నాడు.

కార్తీక్‌కు కోల్‌కతా జట్టు గతేడాది రూ.7.4 కోట్లు చెల్లించింది. ఫామ్‌లో లేక‌పోవ‌డంతో పాటు వికెట్‌కీపర్‌ స్థానానికి విపరీతమైన పోటీ ఉండటంతో అత‌ను భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.