
ఆడపిల్లను పురిటిలోనే చంపేస్తున్నారు. కళ్లు తెరిచి ఈ లోకాన్ని చూడకముందే పసిగుడ్డులను అంతమొందిస్తున్నారు.
ఆడపిల్ల పుడితే ముళ్లపొదల్లోనో చెత్త కుప్పల్లోనో పడేస్తున్న ఈ రోజుల్లో కొంత మంది మగవాళ్లు ఆడవాళ్లుగా మారుతున్నారు.
ఆపరేషన్లు చేయించుకుని మరీ ఆడతనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి లింగమార్పిడి ఆపరేషన్లు గుజరాత్లో బాగా పెరుగుతున్నాయి.
ఇప్పటి వరకూ 1000 ఆపరేషన్లు జరిగాయని నిపుణులు అంటున్నారు. ఆకారం పురుషుడిది.. మనస్తత్వం స్త్రీగా కలిగిన పలువురు పురుషులు ఆడవారిగా మారిపోతున్నారు.
అలా 20 మంది సర్జరీలకు సంబంధించిన వివిధ దశల్లో ఉన్నారు. లింగ మార్పిడి చేయించుకుంటున్న వీరంతా ధైర్యంగా తమ పరిస్థితిని ఆయా ప్రాంతాల వారికి తెలియజేస్తున్నారు.
తమ పరిస్థితి గురించి వివరిస్తున్నారు. కొత్త గుర్తింపును కోరుకుంటూ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.
అటువంటి వారికి గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతున్నారు.
ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్ష్ అమీన్ మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లలో అహ్మదాబాబాలో 1000కి పైగా సర్జరీలు జరిగాయని తెలిపారు.
తాను 14 మంది పురుషులకు సర్జరీలు చేసినట్లు చెప్పారు. సర్జరీ చేయించుకునేందుకు ప్రతీరోజూ తన దగ్గరకు 50 నుంచి 60 మంది వరకూ వస్తుంటారని తెలిపారు.
తనలాంటి సర్జన్లు అహ్మదాబాద్లో 80 మందికిపైగా ఉన్నారని చెప్పారు. ఇటువంటి సర్జరీకి కార్పొరేట్ ఆసుపత్రులలో సుమారు రూ. 8 లక్షల వరకూ ఖర్చవుతుందన్నారు.
కొంతమంది వారి వారి ఆర్థిక స్థాయిలను బట్టి విదేశాలకు వెళ్లి సర్జరీలు చేయించుకుంటారని అహ్మదాబాద్ లోని సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ లగవంకర్ తెలిపారు.
అహ్మదాబాద్కు చెందిన 25ఏళ్ల డాక్టర్ జెస్నూర్ డయారా విషయంలోనూ అటువంటి ఆపరేషనే జరిగిందని తెలిపారు.
దీంతో గుజరాత్లోనే తొలి ట్రాన్స్జెండర్ డాక్టర్గా రికార్డు సృష్టించారామె. అంతేకాదు పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన డాక్టర్ జెస్నూర్ డయారా తాను పురుషుడిగా ఉన్నప్పుడు తన వీర్యాన్ని భద్రపరిచింది (భద్రపరిచాడు).
స్త్రీగా మారిన అదే వీర్యంతో ఓ బిడ్డకు తల్లి అవ్వాలని ఉవ్విళ్లూరుతోంది డాక్టర్ జెస్నూర్ డయారా.
ఆమె అనుకున్నదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టిస్తుంది.