ఐటీ కంపెనీలో కొలువుల జాతర

286

నిరుద్యోగ యువ‌త‌కు శుభవార్త. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగ నియామ‌కాలను చేపట్ట‌నుంది.

2021లో భారతదేశంలో సుమారు 30,000 మంది ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్‌ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు.

ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం క‌ల్పించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్‌ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు.

ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్‌-19 నేపథ్యంలో డిజిటల్‌ సొల్యూషన్‌కు భారీ డిమాండ్‌ పెరిగి తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు.

డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్‌ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్‌ బిజినెస్‌, డిజిటల్ సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం.

కరోనానుంచి కోలుకుంటున్న సమయంలో వ్యాపారం తిరిగి పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

భారీ డీల్స్‌ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తులో మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు.

అంతేకాదు ఏప్రిల్ 2020 లో మహమ్మారి పీక్‌ సమయంలోనూ తాము వేత‌నాల‌ను పెంచామ‌ని వెల్లడించారు. గత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది.

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారీగా పుంజుకున్నాయి.

ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని ఆశిస్తోంది.

గత సంవత్సరంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ.