గాడిద‌లు క‌న‌బ‌డుట లేదు

220

శాంతికి, స‌హ‌నానికి మారు పేరు గాడిద‌. ఎంత కొట్టిన స‌హిస్తుంది. ఎవ‌రెంత బ‌రువేసినా మోస్తుంది. ముఖ్యంగా చాక‌లి వాళ్ల‌కు ఇది ప్ర‌ధాన వాహ‌నం.

అటువంటి గాడిద‌ల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో విప‌రీతంగా ప‌డిపోతోంది. ఒక ప్రాంతంలో ఒక‌రోజు క‌నిపించిన గాడిద.. మరుసటి రోజు కనిపించ‌డం లేదు.

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎవ‌రో గాడిదలను మాయం చేస్తున్నారు.

గాడిద‌ల సంఖ్య త‌గ్గుతుండ‌టంపై అధ్యయనం చేయగా కళ్లు చెదిరే విషయాలు బయటకు వచ్చాయి. గాడిద‌లు ఎందుకు మాయ‌మ‌వుతున్నాయంటే.. ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసాన్ని విపరీతంగా విక్రయిస్తున్నట్లుగా తేలింది.

ముఖ్యంగా ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గాడిద మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా గాడిదలను తీసుకొచ్చి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు.

గతంలో ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న 8 గాడిదలను ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

నిజానికి గాడిద మాంసంపై నిషేధం ఉంది. దానిని మాంసం కోసం వినియోగించే జంతువుగా పరిగణించరు.

జంతు వధ చట్టం 2001 ప్రకారం గాడిదను మాంసంగా విక్రయించడం చట్టరీత్యా నేరం. గాడిదను చంపితే జంతు హింస చట్టం కింద, ఐపీసీ 428, 429 సెక్షన్ల ప్రకారం కఠిన శిక్షలు కూడా అమలు చేస్తారు.

కానీ ఇవేవీ పట్టించుకోకుండా, కొంత మంది ఓ ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా గాడిదలను అక్రమ రవాణా చేస్తున్నారు.

గాడిద మాంసాన్ని ప్రజలు ఇంతగా ఇష్ట‌ప‌డ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటంటే.. గాడిద మాంసం తినడం వల్ల లైంగిక పటుత్వం వస్తుందని జనాలు నమ్ముతున్నట్లు వెల్లడైంది.

అలాగే గాడిద మాంసం తింటే బలవంతులుగా తయారవుతారని కూడా నమ్ముతున్నారట. దీంతో పెద్ద ఎత్తున గాడిద మాంసం విక్రయాలు జరుగుతున్నాయి.

బాగా ఎదిగిన గాడిద ధర ఏకంగా రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతోంది. దీన్ని బట్టి గాడిద మాంసాన్ని ఏ రేంజ్‌లో తినేస్తున్నారో అర్థమవుతోంది.

తాజా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో గాడిదల సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే 2012 నుంచి దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య 60 శాతం మేర పడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గాడిద అంటే ఫొటోల్లో చూసే పరిస్థితి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.