తెలంగాణ‌లో కరోనా కొత్త వేరియంట్స్

244

క‌రోనా వైరస్ త‌న రూపాన్ని మార్చుకుంది. మ‌రో రూపంలో దాడి చేస్తోంది. దేశం‌లో రెండు కొత్త కరోనా వేరియంట్స్‌ను వైద్యులు కొనుగొన్నారు.

ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం (23-2-2021) స్వ‌యంగా ప్ర‌క‌టించింది. N440K, E484K అనే రెండు రకాల వేరియంట్లను గుర్తించినట్లు తెలిపింది.

ఈ కొత్త వైరస్ మహారాష్ట్ర, కేరళతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా కేసులు భారత్‌లోనూ నిర్ధారణ అయ్యాయి.

మరోవైపు.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లో క‌రోనా కొత్త వేరియంట్స్ వార్త కాస్త ఆందోళన కలిగించేదే.

అయితే.. భారత్‌లో బయటపడ్డ ఈ కొత్త Covid-19 Strain యూకే రకం, సౌతాఫ్రికా, బ్రెజిల్ రకాల వైరస్‌తో పోల్చితే ప్రమాదకరమైనవా? కాదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

భార‌త్‌లో 187 యూకే రకం కరోనా వైరస్ కేసులు, 6 సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులతో పాటు బ్రెజిల్ రకానికి చెందిన ఒక కేసును గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు.

దేశంలో గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్ వేరియంట్స్, వాటి ప్రమాద తీవ్రత గురించి అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ కొత్త వేరియంట్ల ప్రభావం ఏ మేరకు ఉందనేది ఇప్పుడే చెప్పలేమని డాక్టర్ వీకే పాల్ అన్నారు.

మహారాష్ట్ర, కేరళలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడానికి ఈ కొత్త వేరియంటే కారణమా అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు.

మరింత శాస్త్రీయ అధ్యయనం జ‌ర‌గాల్సి ఉందని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.