పారా హుషార్‌!!!

170

పారా హుషార్‌!!!

ఇన్ని రోజులు ఒక లెక్క‌… ఈ రోజు నుంచి మ‌రో లెక్క అన్న‌ట్టు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఒక‌ప్పుడు హెల్మెట్ లేకుండా ప్ర‌యాణిస్తే చ‌లాన్లు వేశారు.

త‌ర్వాత కోర్టుకు తీసుకెళ్లి అక్క‌డ చ‌లాన్లు క‌ట్ట‌మంటున్నారు. అయితే హెల్మెట్ లేకుండా ప్ర‌యాణిస్తే ఏమ‌వుతుందిలే అనే నిర్ల‌క్ష్యాన్ని పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు.

రోడ్డు ప్ర‌మాదాల‌ను అరి క‌ట్ట‌డానికే ఇటువంటి నిర్ణ‌యాల‌కు సైబ‌రాబాద్ పోలీసులు సిద్ధ‌మ‌య్యారు. ముఖ్యంగా టూ వీల‌ర్స్ విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఎందుకంటే ద్విచ‌క్ర వాహ‌న‌దారులు రోడ్ల‌పై చాలా నిర్ల‌క్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు. అందుకే వారికి షాకిచ్చేలా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.

హెల్మెట్ లేకుండా బండి న‌డిపితే శాశ్వ‌తంగా డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు.

దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు హెచ్చ‌రించారు.

అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు.

తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు.