రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021

240

ఈ ఏడాది ఐపీఎల్‌ను కేవలం రెండు రాష్ట్రాల్లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది.

కరోనా వైరస్ కార‌ణంగా ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా గత ఏడాది ఐపీఎల్‌ను యూఏఈ లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2021 నిర్వహణ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.

కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఈ సీజన్ మ్యాచ్‌లు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యోచిస్తుంది. నేటికీ దేశంలో కరోనా ప్రభావం ఉండటంతో ముంబై, అహ్మదాబాద్ ప్రాంతాల్లోని మైదానాలే ఐపీఎల్ నిర్వహణకు వేదికలుగా మారబోతున్నాయ‌నే స‌మాచారం అందుతోంది.

ముంబై నగరంలోని ప్ర‌ముఖ నాలుగు స్టేడియాలలో గ్రూప్ దశ మ్యాచ్‌లను నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ పెద్దలు, ఐపీఎల్ మేనేజ్‌మెంట్ యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరోవైపు మోతెరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఐపీఎల్ 2021లో కీలకమైన ప్లే ఆఫ్స్ సహా ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని ప్రాథమికంగా బీసీసీఐ అధికారులు చర్చలు జరిపారు.

ఏప్రిల్ రెండో వారం నుంచి ఐపీఎల్ 14ను ప్రారంభించాలని భావిస్తున్నారు. ముంబైలో బ్రబౌర్న్ స్టేడియం, వాంఖెడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, రిలయన్స్ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.

ఈ నాలుగు స్టేడియాలలో ఐపీఎల్ 2021 లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించడం ఉత్తమమని బీసీసీఐ పెద్దలు చర్చలు జ‌రిపిన‌ట్టు మీడియాకు ఓ అధికారి తెలిపారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోవలేదని,

త్వరలో ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటనను బీసీసీఐ చేయనుందని చెప్పారు. కరోనా అనంతరం ఇటీవల‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని బీసీసీఐ నిర్వహించింది.

తాజాగా విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండటంతో అత్యంత ఖరీదైన టోర్నీ ఐపీఎల్‌ను సైతం ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని బీసీసఐ పెద్దలు ధీమాగా ఉన్న‌ట్టు సమాచారం.