
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇప్పటికే నిర్మాత దిల్ రాజుతో “వకీల్ సాబ్” సినిమా పూర్తి చేసిన ఆయన, ఎ.ఎం.రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా…
మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘అయ్యప్పనుం కోషియం’ రీమేక్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
ఈ సినిమాలు పూర్తయిన తరువాత బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు పవన్.
అయితే పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సినిమాకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్గా విధులు నిర్వర్తిస్తూ సినిమాలకు దూరమయ్యారు. ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.
ఇక గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ, జల్సా వంటి చిత్రాలకు ఆనంద్ సాయి కళా దర్శకత్వం వహించారు.
దాదాపు వంద సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన ఆనంద్ సాయి ఎన్నో ప్రశంసలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు.
ప్రస్తుతం పవన్ సినిమాతో ఆనంద్ సాయి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వనున్నారు.