కళాతపస్వి కె.విశ్వనాథ్ పుట్టినరోజు… చిరు విషెస్

293
Chiranjeevi's Wishes to K Viswanath

నేడు కళాతపస్వి కె.విశ్వనాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు “గురుతుల్యులు, పితృసమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం, తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

దర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి.

సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నటించిన “ఆత్మ గౌరవం” సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు.

కె.విశ్వనాథ్ ఎన్ని చిత్రాలు తీసినా ఆయన చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో శైలే వేరు.

భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి.

సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి.

దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా తదితర చిత్రాల్లో ఆయన నటించారు.

సినిమారంగంలో కే విశ్వనాధ్ చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు.