హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా అంబటి రాయుడు

334
new cricket captian

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్‌ తీసుకున్న తెలుగు తేజం అంబటి రాయుడుకి హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు పగ్గాలు అప్పచెప్పారు. కొన్ని రోజుల క్రితం తనకు క్రికెట్‌పై ఆసక్తి తగ్గలేదంటూ రాయుడు.. హెచ్‌సీఏకు లేఖ రాశాడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరాడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడతానంటూ హెచ్‌సీఏకు రాయుడు లేఖ రాయగా, అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ క్రికెట్‌ సారథ్య బాధ్యతలను రాయుడికి కట్టబెట్టారు. త్వరలో విజయ్‌ హజారే ట్రోఫీ ఆడనున్న హైదరాబాద్‌ కెప్టెన్‌గా రాయుడ్ని నియమిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది.

అంబటి రాయుడు తనకు వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లు అండగా నిలిచారంటూ పేర్కొన్నాడు. వీరిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, రాయుడ్ని హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమించిన తర్వాత నోయల్‌ డేవిడ్‌ స్పందించారు. ‘రాయుడికి ఇంకా ఐదేళ్ల క్రికెట్‌ మిగిలే ఉంది. దురదృష్టవశాత్తూ వరల్డ్‌కప్‌లో ఆడలేకపోయాడు. దాంతో నిరాశ చెందాడు. నేను, లక్ష్మణ్‌లు రాయుడితో మాట్లాడి అతన్ని ఓదార్చాం. ఫలితంగా అతని రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గాడు. రాయుడి అనుభవం యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌కు కూడా రాయుడి సేవలు అవసరం’ అని నోయల్‌ డేవిడ్‌ తెలిపారు. ఈ మేరకు రాయుడు నేతృత్వంలోని జట్టును తాజాగా వెల్లడించారు.

హైదరాబాద్‌ విజయ్‌ హజారే ట్రోఫీ జట్టు ఇదే..

అంబటి రాయుడు(కెప్టెన్‌), బి సందీప్‌(వైస్‌ కెప్టెన్‌), అక్షత్‌ రెడ్డి, తన్మయ్‌ అగర్వాల్‌, థాకూర్‌ వర్మ, రోహిత్‌ రాయుడు, సీవీ మిలింద్‌, మెహిద్‌ హసన్‌, సాకేత్‌ సాయి రామ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మిక్కిల్‌ జైశ్వాల్‌, మల్లికార్జున్‌(వికెట్‌ కీపర్‌), కార్తీకేయ కాక్‌, టి రవితేజ, అయా దేవ్‌ గౌడ్‌