
చీరె ఆరేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. మూడేండ్ల చిన్నారి తల్లి మృతదేహం వద్ద అమ్మా లే ఆంటూ కన్నీరుపెట్టింది.
చిన్నారి రోదన పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చోటుచేసుకొంది.
పోలీసుల కథనం ప్రకారం.. నేపాల్కు చెందిన తిలక్ డ్రైవర్. ఇటీవల ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంకా కోలుకోముందే పదిరోజుల కిందట ఓల్డ్ బోయిన్పల్లి నాగిరెడ్డి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనికి కుదిరారు.
భార్య బొగటి జానకి (23), మూడేండ్ల కుమార్తె రోహిణితో కలిసి అక్కడే ఉంటున్నాడు.
మూడ్రోజుల కిందట జానకి కూడా అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో పని మనిషి గా చేరింది.
బుధవారం పనిచేసే ఫ్లాట్ బాల్కనీలో చీరె ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కొంచెం చీరె తగిలింది.
దీంతో విద్యుత్తు షాక్ తగిలి జానకి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.