
విశాఖ నగరంలో కార్మికుల ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. కేంద్రం నిర్ణయంతో స్టీల్ సిటీ విశాఖ భగ్గుమంటోంది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా పరిపాలన భవనాన్ని కార్మికులు ముట్టడించారు.
ఉద్యోగులను ఎవరినీ ప్లాంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటూ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పరిపాలనా భవనం ముందు ఉద్రిక్తత
స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్తున్న ఫైనాన్స్ డైరెక్టర్ కారును పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనకారులు అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డైరెక్టర్ ప్లాంట్లోకి వెళ్ళడానికి వీలు లేదని తేల్చి కార్మికులు అడ్డంగా నిలిచారు.
తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైనాన్స్ డైరెక్టర్ను ఘెరావ్ చేశారు.
దీంతో స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పరుగులు తీసిన ఫైనాన్స్ డైరెక్టర్
ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ఫైనాన్స్ డైరెక్టర్ను ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది.
అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది డైరెక్టర్ను అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
ఆందోళనకారులు ఫైనాన్స్ డైరెక్టర్ వెనక పరుగులు తీసి, ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆందోళన కారుల ఆగ్రహావేశాలను చూసిన ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ అక్కడి నుండి పరుగులు తీశారు.
మరోవైపు విశాఖలో ఉదృతంగా కొనసాగుతున్న నిరసనల హోరుతో పాటు రహదారుల దిగ్బంధం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ట్రాఫిక్ జామ్
కార్మికుల ధర్నా వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు.
తుని వైపు వెళ్లాల్సిన వాహనాలను లంకెలపాలెం నుంచి, సబ్బవరం మీదుగా మళ్లిస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఎన్ఏడి జంక్షన్ పెందుర్తి మీదుగా వెళుతున్నాయి.
ఆందోళనల వల్ల ఎన్ఏడి నుంచి కూర్మన్నపాలెం వరకు అనకాపల్లి నుంచి లంకెలపాలెం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.