రైల్వే ఆఫీస్ లో అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

185
Railways building fire..Nine people killed

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిన్న భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పోలీసు ఏఎస్ఐ ఉన్నట్టు అధికారులు తెలిపారు.

కోల్‌కతాలోని స్ట్రాండ్ రోడ్డులో ఉన్న కోయిలఘాట్ బిల్డింగ్‌లోని 17వ అంతస్తులోని రైల్వే కార్యాలయాలున్న భవనంలో ప్రమాదం సంభవించింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కోల్‌కతా కమిషనర్ సౌమెన్ మిత్రా, మంత్రి సుజీత్ బోస్, జాయింట్ సీపీ మురళీధర్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.

గత రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీ పరిస్థితిని చూసి చలించిపోయారు.

బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

సాయంత్రం వరకు భవనంలో మంటలు ఎగసిపడుతుండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

దీంతో తూర్పు జోన్‌లో కంప్యూటరైజ్‌డ్ టికెట్ బుకింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

10 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఫైర్ బ్రిగేడ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.