కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి: ఆర్.నారాయణమూర్తి

139
R. Narayana murthy

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్-2021పై సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారని అన్నారు. కేవలం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించారన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని అన్నారు.

జీఎస్టీ, సెస్ లను కేంద్ర పరిధిలోకి తీసుకెళుతున్నారని చెప్పారు. ఇలా అయితే రాష్ట్రాలు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే పనులు జరుగుతున్నాయని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. చివరకు పంచభూతాలను కూడా అమ్మేస్తారని ఆయన దుయ్యబట్టారు. అప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డాక్టర్ స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరమే లేదని ఆయన అన్నారు.