మళ్లీ పెరిగిన చ‌మురు ధరలు

242

ఎవ‌రు ఎంత మొత్తుకున్నా.. ఎంత బాధ‌ప‌డినా చ‌మురు ధ‌ర‌లు మాత్రం త‌గ్గ‌డం లేదు. పైగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా చ‌మురు ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు నానా తంటలు పడుతున్నారు. ఈ నెలలోనే చమురు ధరలు 15సార్లు పెరిగాయి.

అయితే మూడు రోజులు స్థిరంగా ఉన్న చ‌మురు ధరలు మరోసారి శనివారం పెరగడంతో వాహనదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో తాజాగా దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసలు వరకు పెంచాయి.

ఈ నెలలోనే చమురు ధరలు పెరగడం ఇది 16వసారి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు చొప్పున ధర పెరిగింది.

దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.47గా నమోదైంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.97.57, డీజిల్‌ రూ.88.70కి చేరుకుంది.

బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్‌ రూ.94.22కి పెరగగా.. డీజిల్ రూ.86.37కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.91.11కి ఉండగా.. డీజిల్ రూ.86.45కి చేరింది.

కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.35కి చేరగా… డీజిల్ 15 పైసలు పెరిగి లీటర్ రూ.84.35కి చేరుకుంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రో ధరలు మండుతున్నాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్‌పై 17పైసలు ధర పెరిగింది. దీంతో పెట్రోల్‌ ధర రూ.94.79 కు చేరగా.. డీజిల్‌ ధర రూ.88.86గా నమోదైంది.

విజయవాడలో పెట్రోల్ లీటర్ 97.00కి చేరగా… డీజిల్ ధర రూ.90.55కి పెరిగింది. అయితే గడిచిన 30 రోజుల్లో దాదాపు పెట్రోల్‌ ధర రూ.5 పెరగింది.

ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

గత 58 రోజుల్లో చమురు కంపెనీలు.. పెట్రో ధరలను దాదాపు 26సార్లు పెంచాయి.

దీంతో పెంచిన ధరలను తగ్గించాలంటూ దాదాపు 40వేల సంఘాలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కూడా నిర్వహించాయి.