
కొన్ని సందర్భాల్లో మనం సరిగా చూసుకోకపోవడంతో మన చేతికి చిరిగిపోయిన కరెన్సీ నోట్లు వస్తుంటాయి.
ఆయా షాపుల్లో కొనుగోలు చేసే సమయంలో కొన్ని నలిగిపోయిన.. పాతబడిన నోట్లు మనవద్దకు వస్తాయి.
ఇక ఈ నోట్లు మన వద్ద ఉంటే ఎలా మార్చుకోవాలా? అని తెగ చింత పడుతుంటాం.
దుకాణాల్లో, ఇచ్చినా, ప్రయాణాల్లో వాడినా ఫలితం లేక రోజుల తరబడి జేబుల్లోనే పెట్టుకోవాల్సిన దుస్థితి.
అయితే ఈ చెరిగిన నోట్లను మీ సమీపంలోని ఏ బ్యాంక్కైనా ఇక వెళ్లి సులువుగానే మార్చుకోవచ్చు. వాటికి బదులుగా కొత్త నోట్లను తెచ్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెబుతోంది.
పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచింది. నోట్ల మార్పిడికి ఎలాంటి చార్జీలు కూడా వసూలు చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇటీవల రూ.5 లక్షల విలువైన నోట్లు చెదలు పట్టిన ఘటన వెలుగుచూసిన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తీవ్రంగా దెబ్బతిని చెల్లుబాటు కాని స్థితిలో ఉన్న కరెన్సీని కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
చిరిగిపోయిన నోట్లపై నెంబర్ మాత్రం తప్పక కనిపించాల్సి ఉంటుంది. నిజానికి పాడైపోయిన నోట్లను కమీషన్ తీసుకుని బదులుగా ఇతర నోట్లను ఇచ్చే వ్యాపారం నడుస్తున్న విషయం తెలిసిందే.