
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ తెలిసీతెలియని మూర్ఖుడని నిప్పులు చెరిగారు.
ఈ నెల 21 వరకు తనను గృహ నిర్బంధంలో ఉంచేలా ఎస్ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయన్న వార్తలపై మంత్రి స్పందిస్తూ నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తాను ఇంట్లోనే ఉన్నా జరిగేది జరుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగినా తిరగకపోయినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబులాగే నిమ్మగడ్డకు కూడా పిచ్చి ముదిరిందని విమర్శించారు.
ఓ మంత్రిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చంద్రబాబుకు బంట్రోతులా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. నిమ్మగడ్డకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.