కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు లేవు: రాచకొండ సీపీ

159
Cp mahesh bhagwat

జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్నిరాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. మొదటి టీకాను ఆయన తీసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు లేవని అన్నారు.హైద్రాబాద్ నగరంలోని కమిషనరేట్‌ పరిధిలోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కరోనా టీకా అందిస్తున్నట్లు చెప్పారు.

రాచకొండ కమిషనరేట్‌లో వ్యాక్సినేషన్‌ కోసం 49 కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందులో 6 వేల పోలీసు సిబ్బంది, ఆక్టోపస్‌, ఎన్‌ఎస్జీ, సీఆర్పీఎఫ్‌ వంటి బెటాలియన్లకు చెందిన 6 వేల మంది సిబ్బందికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో రెండోవిడుత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అయిన పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. కరోనా టీకా కోసం సుమారు 2 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.