ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా

268
Ganta Srinivas Rao

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్‌ శనివారం లేఖ రాశారు.

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని గంటా శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని గంటా సూచించారు.

మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు విశాఖలో రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైసీపీ నేతలు మద్దతు తెలిపారు.

ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వమని అన్నారు. జిల్లాకే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.