రేషన్ పంపిణీ వాహనదారులకు ఇకపై నెలకు రూ.21 వేలు!

160
Ration delivery vechicle

లబ్దిదారుల ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డెలివరీ వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రతి నెలా ఇచ్చే చెల్లింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం వాహనదారులకు నెలకు రూ.16 వేలు చెల్లిస్తున్నారు. వాటిలో అద్దె కింద రూ.10 వేలు, ఇందన ఖర్చులు రూ.3 వేలు, హెల్పర్‌ చార్జీల కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని భావించారు.

క్షేత్రస్థాయిలో వారిపై భారం పడుతోందని గుర్తించిన ప్రభుత్వం అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్‌ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది.

పెట్రోల్‌ కోసం రూ.3 వేలు చెల్లిస్తారు. అంటే రూ.16 వేలకు బదులు రూ.21వేలు అందజేయనున్నారు. రేషన్ పంపిణీ వాహనాలు శుభ్రంగా లేకపోతే వారికి అందే చెల్లింపుల్లో కోత ఉంటుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. వాహనాలను ఎప్పటికప్పుడు తహసీల్దార్లు తనిఖీలు చేస్తుంటారని పేర్కొంది.