పప్పుధాన్యాల్లో కూడా అత్యధిక ప్రొటీన్లు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

180
Niranjan reddy

మాంసాహారం తర్వాత పప్పుధాన్యాల్లోనే అత్యధిక ప్రొటీన్లు ఉంటాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో “వరల్డ్ పల్సెస్ డే” పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పప్పుల్లో 20 నుంచి 25 శాతం ప్రోటీన్లు ఉంటాయని చ్కెప్పారు. వరి కన్నా మూడింతలు, గోధమకన్నా రెండింతలు ప్రొటీన్లు పప్పుల్లో ఎక్కువుంటాయని మంత్రి పేర్కొన్నారు. పప్పు ధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది తెలంగాణలో 10.8 లక్షల ఎకరాలలో కంది సాగును ప్రోత్సహించారని తెలిపారు.

ప్రపంచంలో అత్యధికంగా పప్పుధాన్యాలు పండేది మన దేశంలోనే పండిస్తారని తెలిపారు. ప్రతి ఏటా 20 నుంచి 22 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. దేశ అవసరాల నిమిత్తం రెండు నుంచి మూడు మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. మన రాష్ట్ర నేలలు పప్పు ధాన్యాల సాగుకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి రైతులు కందితో పాటు పెసర, మినుము తదితర పంటలు మరింతగా సాగు చేయాలని మంత్రి సూచించారు.