
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేయూ, ఓయూలను కేసీఆర్ నాశనం చేశారని ఆయన అన్నారు.
కానీ, ఆయన అనుచరులకు మాత్రం ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించింది కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న విషయం సీఎం కేసీఆర్ కు తెలుసని అన్నారు. అందుకే ఆయన ఇప్పటిదాకా ఓటు అడగలేదని విమర్శించారు.
అన్ని సర్వేలూ బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయని, టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితులున్నాయని అన్నారు.
అందుకే టీఆర్ఎస్ కు ఓటేయండంటూ ఆయన అడగలేదన్నారు. గెలిచే పరిస్థితులుంటేనే కేసీఆర్ ఓటు అడుగుతారన్నారు. ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు.
నడిరోడ్డు మీద లాయర్ దంపతులను హత్య చేసినా కేసీఆర్ మాట్లాడలేదన్నారు. భైంసాలో జరిగిన అల్లర్లపైనా నోరు విప్పలేదని విమర్శించారు.
భైంసా అల్లర్లు జరిగితే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని సంజయ్ ప్రశ్నించారు.