
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న వారిలో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటన రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలో జరిగిందీ. గ్రామంలోని శివాలయంలో నిన్న వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు.
బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. ప్రసాదం విషపూరితం కావడమే భక్తుల అస్వస్థతకు కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.