
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో మూడ్రోజుల కిందట జరిగిన ఘర్షణలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
పట్టణంలోని బట్టి గళ్లీ ప్రాంతంలో జరిగిన మతపరమైన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు.
గత మూడ్నాలుగు దశాబ్దాలుగా భైంసాలో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉందన్నారు.
ఓ వర్గం వారు మరో వర్గంపై తరచుగా దాడులు చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.
ఈ ఘటనలు మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని విద్రోహశక్తులు కుట్ర పన్నినట్టు అర్థమవుతోందని అన్నారు.
ఈ దాడులపై ఇప్పటికే తెలంగాణ డీజీపీతో రెండుసార్లు మాట్లాడానని తెలిపారు. వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని కోరినట్టు తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరానని వివరించారు.
మతకల్లోలాలు, ఘర్షణలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.