
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను దుండగులు బుధవారం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో వామన్రావు తల్లిదండ్రులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేతలు పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇది ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను చంపేశారని అన్నారు.
న్యాయవాదుల హత్యల ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.