నేను కాంగ్రెస్ లోకి వెళ్ళటం లేదు – కొండా సురేఖ

319
im-not-going-into-congress-konda-surekha

వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తారనే ఆశ తోనే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకి మంత్రి పదవి ఎందుకు రాలేదు? పదవి రాకుండా అడ్డుకున్నదెవరు? అనే విషయాలను నిశితంగా వివరించారు.



ఎన్నిరోజులు ఇబ్బంది పెడతారో చూద్దాం

” నేను మంత్రి అయితే వరంగల్ జిల్లాలో చాలా మంది నాయకులకు ప్రాధాన్యత పోతుందనుకున్న వాళ్లు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌ గారికి నాపైన వ్యతిరేకంగా చెప్పారు. వరంగల్ జిల్లాలో 90 శాతం మంది టీఆర్ఎస్ నేతలు నాకు పదవి వద్దన్నారు. మేమంటే వాళ్లకు భయం.. అందుకే మంత్రి పదవికి అడ్డుపడ్డారు. టీఆర్ఎస్‌‌లోకి రమ్మన్నాక 3 నెలలపాటు ఆలోచించాం. టీఆర్ఎస్‌లోకి చేరింది పదవులు కోసం కాదు.. నా అవసరం కోసమూ కాదు. అధికార పార్టీలో చేరకుంటే ఇండిపెండెంట్‌గా పోటీచేసేదాన్ని. నేను ఎప్పుడూ టీఆర్ఎస్‌ను వ్యతిరేకించలేదు.. టీఆర్ఎస్‌‌ను ఎప్పుడూ తిట్టలేదు. మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాల్ల మీద మాత్రమే మాట్లాడాను. కాంగ్రెస్‌లోకి చేర్చుకుని సీటు ఇవ్వకుండా చేయాలని కొందరు చూశారు. దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడిస్తామని చెప్పి పార్టీ కండువాలు కప్పారు. మాది జన బలం.. అందుకే మిగిలిన నేతలకు భయం. కొండా మురళీలో రౌడీ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి?. మమ్మల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో చూస్తాం” అని సురేఖ ఆగ్రహంతో చెప్పారు.

కేసీఆర్‌ గారికి నమ్మకం ఉంది

మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా దంపతులు గులాబీకి గుడ్‌బై చెప్పి హస్తం గూటికి చేరతారని వచ్చిన వార్తలపై ఈ సందర్భంగా సురేఖ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్‌‌లో ఇమడలేక పోతున్నామన్నది నిజం కాదు. మేం పార్టీ పట్ల అసంతృప్తితో లేము. తాను పార్టీ మారతాననే అనుమానం సీఎం కేసీఆర్‌కు లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ఉత్తమ్ చీఫ్ పాలిట్రిక్స్! – నాపై పోటీ చేయమనండి..

” వరంగల్ జిల్లా నేతలు నన్నపునేని నరేంద్ర, ప్రదీప్, సారయ్యను, నాపైన పోటీ చేయమనండి.. మా పవరేంటో చూపిస్తాం. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరగలేదు.. ఆ పార్టీలోకి వెళ్లేది లేదు. పొన్నాల లక్ష్మయ్య, గండ్రలతో లాభం లేదనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మమ్మల్ని పార్టీలోకి చేర్చుకోవాలనుకున్నారు. ఉత్తమ్ చీఫ్ పాలిట్రిక్స్ ప్లే చేశారు. పొన్నాల పనికిరారనే వెంటనే పీసీసీ నుంచి తొలగించారు” అని ఆమె చెప్పుకొచ్చారు.

నా కూతురికోసం సీటు అడుగుతాం..

‘నా కూతురు కోసం భూపాలపల్లి, పరకాలలో ఒక సీటు అడుగుతాం. పరకాల, భూపాలపల్లి కార్యకర్తలు కొండా నాయకత్వం కావాలనుకుంటున్నారు. నా సీటుకోసం ప్రదీప్ రావు, సారయ్య ప్రయత్నిస్తే మేం ఎందుకు మాకు ఇష్టమైన సీట్లు అడగొద్దు?. పొన్నాల మీద నేను.. గండ్ర మీద నా బిడ్డను నిలబెట్టి గెలిపిస్తాను. గండ్ర చాలా వీక్‌‌గా ఉండటం కాదు.. మేం స్ట్రాంగ్‌గా ఉన్నాం. సీఎం కేసీఆర్ మమ్మల్ని దూరంగా పెట్టలేదు.. అది అవాస్తవం. టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదు’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.