తెలంగాణ, ఏపీకు ఒకేరోజు ఎన్నికలు!

199
Elections

రానున్న పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఒకే విడుతలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. రెండు రాష్ర్టాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ వంటివి నివారించవచ్చని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ర్టాలుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ రెండు రాష్ర్టాలకు చెందినవారు చాలా మంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని వెల్లడించారు. సందర్భానుసారం స్వస్థలాలకు వెళ్ళి వస్తుంటారని చెప్పారు. తెలంగాణలోని ఆరు జిల్లాలు ఏపీతో సరిహద్దుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీకి చెందినవారిలో చాలామంది తెలంగాణలో సైతం ఓటుహక్కు కలిగిఉన్నారన్నారు.




 

ఈ రెండు రాష్ర్టాల్లో ఒకే రోజు పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రలోభాలకు తావులేకుండా చేయడంతోపాటు డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివాటిని నివారించవచ్చని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల కమిషన్‌లోని ముగ్గురు కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.