ట్రాన్స్ జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగం

245

స‌మాజం వెలివేసిన వాళ్ల‌లో ట్రాన్స్ జెండ‌ర్లు ఒక‌రు. ఏదైనా ఉద్యోగం చేసి బ‌తుకుదామంటే ఎవ్వరూ ఉద్యోగ‌మివ్వ‌రు.

కొంత మంది రైళ్లల్లో డ‌బ్బులు ఆడుక్కుంటూ జీవిస్తుంటారు. స‌మాజం వెలివేసిన ఇటువంటి వారిని ఛ‌త్తీస్‌గ‌ఢ్ పోలీస్ శాఖ అక్కున చేర్చుకుని ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచింది.

ఆ రాష్ట్రంలో ఏకంగా 13 మంది ట్రాన్స్ జెండర్లకు పోలీసు ఉద్యోగాలు దక్కాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు ఏమీ చేయలేరని భావించే వాళ్లకు ఇది కొత్త అర్థం చెబుతోంది.

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వీరిని కానిస్టేబుళ్లుగా నియమిస్తూ ఛత్తీస్‌గఢ్ పోలీస్ రిక్రూట్మెంట్ సాగటం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ఇలా నియ‌మించ‌డం దేశంలో ఇదే తొలిసారి. థర్డ్ జెండర్‌కు ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.

2019-20 మధ్య కాలంలో జరిగిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌లో వీరు పాస‌య్యారు. సర్కారీ కొలువులు ద‌క్కించుకున్నారు.

ఇప్పటి వరకు మన దేశంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు మాత్రమే ఇలా ఖాకీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

తమిళనాడు, రాజస్థాన్‌ల‌లో ఒక్కరు చొప్పున ట్రాన్స్ జెండర్లు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ అడుగుజాడల్లో పయనించేందుకు బిహార్ సర్కారు కూడా సిద్ధమైంది.

2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్ జెండర్లను థర్డ్ జెండర్స్‌గా గుర్తించింది. కాబట్టి స్త్రీ, పురుషులతో సమానంగా గౌర‌వంతో పాటు అవకాశాలు కూడా దక్కుతాయి.

నిజానికి ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ 2017లోనే థర్డ్ జెండర్‌ను పోలీస్ ఎంపిక పరీక్షలు రాసేందుకు అర్హులుగా ప్రకటించింది.

దీంతో రాష్ట్రంలో లింగమార్పిడి చేయించుకున్నవారు పోలీసులు అయ్యేందుకు ఉత్సాహం చూపారు. పోలీస్ శాఖలో కొలువు సంపాదించటానికి తామెంతో కష్టపడ్డట్టు ఎంపికైన ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించేందుకు కఠినమైన శిక్షణ తీసుకున్నామ‌ని తెలిపార. పోలీస్ కావాలన్న కల ఎట్టకేలకు సాకారం అయిందని ఈ 13 మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మన దేశంలోని ట్రాన్స్ జెండర్లు చురుకైన పాత్ర పోషిస్తూ చాలా రంగాల్లోకి అడుగుపెడుతున్నారు.

కోయంబత్తూరులో ట్రాన్స్ జెండర్లు నిర్వహిస్తున్న రెస్టారెంట్ లాభాల్లో పడటంతో వారు మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించ‌నున్నారు.

ఇప్పుడిప్పుడే వీరిని చూసే దృష్టికోణంలోనూ మార్పులు వస్తున్నాయి. వీరికి పాన్, ఆధార్‌తో సహా అన్ని గుర్తింపు కార్డులు లభిస్తున్నాయి.

భారతీయ రైల్వేల్లో వీరికి 40శాతం రాయితీకి టికెట్ లభిస్తుంది. వారణాసిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకించిన టాయ్‌లెట్స్‌ను ప్రారంభించారు.

ట్రాన్స్ జెండర్ టాయిలెట్ పేరుతో దేశంలో మరిన్ని ఇలాంటివి ప్రారంభం కానున్నాయి.