
పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సినీ తారలు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు.
ఇటీవలే స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరగా, తాజాగా మరో నటి సాయంతిక బెనర్జీ అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కోల్ కతాలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో టీఎంసీ సీనియర్ నేతలు సుబ్రతా ముఖర్జీ, పార్థ ఛటర్జీ సమక్షంలో సాయంతిక టీఎంసీలో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎప్పటినుంచో మమతా బెనర్జీకి అభిమానినని చెప్పారు.
అన్ని వేళలా ఆమె వెంట నడవాలని భావిస్తానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.
టీఎంసీలో చేరడాన్ని గౌరవంగా భావిస్తానని ఆమె అన్నారు. అందుకే టీఎంసీలో చేరినట్టు ఆమె వెల్లడించారు. పార్టీ ఆదేశాల ప్రకారం ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తానని సాయంతిక స్పష్టం చేశారు.