
తెలంగాణలోని ఓ ఉత్తమ సర్పచ్ ఏసీబీ వలకు చిక్కాడు.షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతులకోసం రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నారు.
ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ ప్రధాన రహదారిపై తనకున్న 27 గుంటల భూమిలో దుకాణ సముదాయం నిర్మించాలని ముజాహిద్ అలం నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులను హెచ్ఎండీఏ నుంచి తీసుకున్నాడు. నెల రోజుల క్రితం భవన నిర్మాణం కూడా ప్రారంభించాడు.
విషయం తెలిసిన మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్ అక్కడ వాలిపోయాడు. తనకు రూ. 20 లక్షలు ఇస్తేనే పనులు జరగనిస్తానని,
లేదంటే పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలబోవని ముజాహిద్ను హెచ్చరించాడు.
అయితే, తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరికి రూ. 13 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.
డబ్బు సర్దుబాటు చేశానని వచ్చి తీసుకోవాలని సర్పంచ్ వినోద్కు ముజాహిద్ ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో ఆ సొమ్ము పట్టుకుని బండ్లగూడలోని ఆరెమైసమ్మ వద్దకు తీసుకురావాలని సూచించాడు.
అతడు చెప్పినట్టే అక్కడకు డబ్బుతో వెళ్లిన ముజాహిద్ కారులో ఉన్న సర్పంచ్కు డబ్బులు అందించాడు.
అక్కడే మాటువేసిన అనిశా అధికారులు దాడిచేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు వినోద్ గౌడ్ను నేడు చంచల్గూడ జైలుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.