దేశంలో ఊపందుకొన్న వ్యాక్సినేషన్..నిన్న ఒక్క రోజే 5,09,893 మందికి టీకాలు!

167
Covid-19 Vaccine Second Dose Telangana

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 50 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది.

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 11,814 కేంద్రాల్లో 5,09,893 మందికి టీకాలు వేశారు. కేవలం 20 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశం మనదేనని పేర్కొంది.

మొత్తం 8 రాష్ట్రాల్లో దాదాపు 61 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో 11.9 శాతం మందికి టీకా ఇచ్చినట్టు కేంద్రం పేర్కొంది. తొలి డోసు తీసుకున్న వారికి ఈ నెల 13 నుంచి రెండో డోసు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. నిజానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజుల్లో కొంత మందకొడిగా కొనసాగగా ఆ తర్వాత మాత్రం ఊపందుకుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగాఇప్పటి వరకు 67 దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇంతవరకు 11.90 కోట్ల మంది టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా ముందంజలో ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 3.67 కోట్ల మందికి వైద్య సిబ్బంది టీకాలు వేశారు.