ఆ రెండు పార్టీలది అక్రమ సంబంధం: బండి సంజయ్

186

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయం ఎన్నికైన విషయం తెలిసిందే.

ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్‌, డిప్యూటి మేయర్‌ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

టీఆర్ఎస్ఎం, ఐఎం అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైందన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండడం ఖాయమని తెలిపారు.

టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్రచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

ఒక్క పైసా అవినీతి జరిగినట్టు తెలిసినా ఈ రెండు పార్టీలను బజారుకీడ్చుతామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో తమ మధ్య పొత్తులేదని, తాము వేర్వేరు అని చెప్పి సిగ్గులేకుండా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

నిజాయతీతో కూడిన రాజకీయం చేయాలని అనుకుంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకోవాల్సిందని హితవు పలికారు.