మునిసిపల్ కార్మికులతో కలిసి పనిచేసిన హరీశ్ రావు

159
Harish Rao Minister

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మునిసిపల్ కార్మికులతో కలిసి పనిచేశారు. సిద్ధిపేట జిల్లాలో కార్మికులతో కలసి తడి, పొడి చెత్తను వేరు చేసే యూనిట్ వద్ద ఆయన పనిచేశారు.  కార్మికులు ధరించే యూనిఫామ్ ను హరీశ్ రావు దరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృథా అని భావించే ప్రతి వస్తువునూ ఏదో రూపంలో తిరిగి వినియోగించుకోవచ్చని అన్నారు. సిద్ధిపేట పట్టణంలో పోగయ్యే చెత్త రోజుకు 40 మెట్రిక్ టన్నులు అవుతుందన్నారు. దీనిలో తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 2.50 కోట్లతో మానవ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ప్రజలు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను ఎస్ఎఫ్టీపీకి ఇవ్వాలని, దాన్ని రీసైకిల్ చేసిన తరువాత 800 కేజీల ఎరువు, 16 వేల లీటర్ల నీరు వస్తుందని నీటిని మొక్కలకు, ఎరువును రైతులకు ఉచితంగా ఇవ్వనున్నామని అన్నారు. చెత్త, చెదారాలను ఎరువులుగా మార్చుకునే వీలుంటుందని ఆయన అన్నారు. మానవ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును తొలుత సిరిసిల్లలో ఏర్పాటు చేసి సత్ఫలితాలు పొందామని చెప్పారు. అన్ని మునిసిపాలిటీల్లో ఇవే తరహా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.