ఇది నిజాం పాలన కాదు..కేసీఆర్‌పై విజ‌య‌శాంతి తీవ్ర విమర్శలు

236

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి విమర్శనాస్త్రాలు సంధించారు.

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో హాలియా సభలో కేసీఆర్ ప్ర‌జ‌లను అవ‌మాన‌ప‌ర్చేలా వ్యాఖ్య‌లు చేశార‌ని మండిపడ్డారు.

సభలో బాధిత మహిళలను కుక్కలు అనడం చూశామని విజ‌య శాంతి అన్నారు.

ఇది నిజాం పాలన కాదని, ప్రజాస్వామ్యమని అన్నారు. టీఆరెస్ కు మరో డోసు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ తీరున మరో డోసు ప్రజలు ఇవ్వనున్నారని చెప్పారు. రానున్న ఎమ్మెల్సీ, సాగర్, కార్పోరేషన్‌ల ఎన్నికల డోసు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

గతంలో నాయకులు పార్టీలపై అవమానకరంగా దుర్భాషలాడారని అన్నారు. హెచ్ఎంసీ కార్పోరేటర్లకు భాష, ప్రవర్తన, నియమావళి గురించి సీఎం చెబితే వినవలసి రావడం విడ్డూరంగా ఉందని విమ‌ర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిన ప్రచార సభల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సాక్షాత్తూ సీఎం అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం ప్రజలు చూశారన్నారు.

కనీస రాజకీయ సంస్కారం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఈ సీఎం గారిని ఒక్క మాట ఎదిరించి అనరాదని టీఆరెస్ ముఖ్యనేతలు పెడబొబ్బలు పెడుతున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు.