నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించండి

223

త‌న వ్యాపారం కోసం వేల కోట్లు అప్పు చేశాడు. ఉన్న‌ట్టుండి విదేశాల‌కు పారిపోయాడు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.

అత‌డిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని లండ‌న్‌లోని భార‌త దౌత్య‌కార్యాల‌యం చాలా రోజులుగా స్థానిక కోర్టులో పోరాడుతోంది. చివ‌రికి గురువారం లండ‌న్ కోర్టు నీర‌వ్ మోడీకి షాకిచ్చింది.

నీరవ్ ను భారత్ కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా లండన్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని కోర్టు భావించింది.

నీరవ్‌ను విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. భారత్​కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్​ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది.

భారత్​కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని కోర్టు భావించింది.

ఆయనకు మానసిక స్థితి సరిగాలేదనే వాదనను కోర్టు కొట్టి పారేసింది. నీరవ్​ కు ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ బ్యారక్​ సరిపోతుందని కోర్టు పేర్కొంది.

అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది. సాక్ష్యాలను నీరవ్ మోడీ నాశనం చేశారని కోర్టు తెలిపింది.