పీఎఫ్ ఖాతాదారులూ.. అల‌ర్ట్‌

224

మీ జీతంలో నుంచి పీఎఫ్ క‌ట్ అవుతోందా? అయితే ఈ విష‌యాన్ని మీరు త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈపీఎఫ్ నుంచి పొందిన వ‌డ్డీకి ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధ‌న మార‌బోతోంది.

ఈపీఎఫ్ లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వారికి అందించే వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు. 1, ఏప్రిల్ 2021 నుంచి ఇది అమలులోకి వస్తుంది.

పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే 80సీ కింద ఎప్పటిలానే మినహాయింపు లభించనుంది. పీఎఫ్‌లో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే ఆ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పీఎఫ్‌లో ఉద్యోగితో పాటు అతను పని చేస్తున్న సంస్థ కూడా ఉద్యోగి తరఫున కొంత జమ చేస్తుంది. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు.

కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఉద్యోగుల ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం ఈ ట్యాక్స్ ను లెక్కిస్తారు. ఉద్యోగి ఎంత శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తే అంత శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఉద్యోగి 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌ పరిధిలోకి వస్తే అతను 30 శాతాన్ని పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. రూ.2.5 లక్షలకు లోపు పీఫ్ జ‌మ అయితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

అలాంటి వారు నూతన ట్యాక్స్ విధానంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంపై ఆర్థిక శాఖ త్వరలోనే మార్గదర్శకాలు విడుద‌ల చేయనుంది.