అంబానీకి బెదిరింపు లేఖ

210

పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి గుర్తు తెలియ‌ని ఓ అగంత‌కుడు బెదిరింపు లేఖ రాశాడు.

ఆయ‌న నివాసం ఉంటున్న‌ ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న కారును పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కారులో ఆగంతకుడు ఓ లేఖ పెట్టి వెళ్లాడు. ఆ లేఖను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులోని వివరాలను శుక్రవారం బహిరంగ పర్చారు. లేఖను ఆంగ్లంలో రాశాడని పోలీసులు తెలిపారు.

ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలను ఉద్ధేశించి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు.

ఈ పేలుడు పదార్థాలున్న కారును మీ ఇంటి సమీపంలో వదిలివేయడం కేవలం ట్రైలర్ మాత్రమే అని ఆ పేర్కొన్నాడు.

మరోసారి పేలుడు పదార్థాలు మీ వద్దకే వస్తాయంటూ ఆగంతకుడు హెచ్చరించాడని పోలీసులు చెప్పారు. అంతేకాదు, అంబానీ కుటుంబం మొత్తాన్ని అంతం చేయడానికి ఈసారి పూర్తి సన్నద్ధతతో వస్తానని బెదిరించినట్టు తెలిపారు.

పేలుడు పదార్థాలతో లభ్యమైన వాహనం నెంబరు కొన్ని ముఖేశ్‌ అంబానీ కాన్వాయ్ కారు నంబర్‌ ప్లేట్లతో మ్యాచ్‌ అయ్యాయని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నివాసమున్న ప్రాంతంలో భద్రతను పెంచారు.

గాందేవీ పోలీసు స్టేషన్ పరిధిలోని కార్మికెల్ రోడ్‌లో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు.

ఇతర పోలీసు బలగాలు కూడా అక్కడకు చేరుకుని.. అందులో పేలుడు పదార్థాలను గుర్తించాయి.

ఆ వాహనం అక్కడికి ఎలా వచ్చిందనే దిశగా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.