
ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఓ ప్రెస్మీట్లో అనుకోని ఘటన చోటు చేసుకుంది.
ప్రెస్మీట్ నిర్వహిస్తుండగా ఓ ఎంపీ తన పక్కనే కూర్చున్న మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మరోసారి అధికారం చేపట్టాలనీ టీఎంసీ, ఈసారైనా పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ హోరా హోరీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
వరుస ప్రెస్మీట్లతో దూకుడు పెంచాయి. ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తమ పార్టీకే చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లారు. ఈ వ్యవహారం టీఎంసీకి తలనొప్పిగా మారింది.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం మమతా బెనర్జీ బీజేపీతో పోరాడుతుంటే ఈ ఘటన ఆమెకు తలనొప్పిలా తయారైంది.
ఈ వీడియోను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.
దానికి ‘‘టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీ బాన్కురా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడని పేర్కొన్నారు.
టీఎంసీకి చెందిన కొందరు నాయకులు కూడా ఈ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఎంపీ కల్యాణ్తో పాటు ఎమ్మెల్యే అలోక కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలో మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఎంపీ కల్యాణ్ ఎమ్మెల్యే బుగ్గను గిల్లారు. అసలు ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా ఇవ్వలేదు.
ఈ ఘటనతో టీఎంసీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ట్వీట్పై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ ‘ఆమె తన డర్టీ మైండ్ను బయటపెట్టుకున్నారు.
అన్నా చెల్లెలి రిలేషన్ ఏంటో ఆమె తెలుసుకోవాలి. నేను కూడా బాన్కురా నియోజకవర్గానికి చెందిన వాడినే. 25 ఏళ్లుగా ఆమెను సొంతచెల్లిగా చూసుకుంటున్నా. డర్టీ మైండ్ ఉన్న లాకెట్ ఛటర్జీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి” అని ట్వీట్ చేశారు.