కేరళలో ‘నిపా’ వైరస్ కలకలం – హై అలర్ట్

804
High Alert In Kerala - nipah virus In Kozhikode

కేరళను నిపా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ సోకడం కారణంగా కోజికోడ్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలి.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందిని వైద్యాధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. వైరస్ నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు జిల్లా వైద్యాధికారులు పంపారు. విష జ్వరాలపై కలెక్టర్ జోస్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నిపా వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రజలను వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పందులు, ఇతర జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు.




 

నిపా వైరస్‌పై కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. నిపా వైరస్‌పై వ్యాప్తిపై స్పందించారు. జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేరళ వెళ్లాల్సిందిగా ఆయన ఆదివారం ఆదేశించారు. నిపా వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జేపీ నడ్డా సూచించారు. ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాలు కూడా లేకపోవడంతో.. ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

నిపా వైరస్ ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?

నిపా వైరస్.. కేరళను వణికిస్తున్న ఈ కొత్త వ్యాధి ఇప్పటికే 16 మందిని పొట్టన పెట్టుకుంది. నిజానికి ఈ వైరస్ ఇప్పుడే పుట్టుకొచ్చిందేమీ కాదు. 1998-99లోనే మలేషియా, సింగపూర్‌లలో 100 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. నిపా వైరస్ (NiV) పారామిక్సోవిరిడే జాతికి చెందిన వైరస్. దీనిని 1999లోనే గుర్తించినట్లు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. బంగ్లాదేశ్‌లో అయితే ప్రతి ఏటా కనిపిస్తూనే ఉంటుందని సీడీసీ తెలిపింది.

అప్పుడు పందులు.. ఇప్పుడు గబ్బిలాలు

ఈ వైరస్ కారణంగా మెదడు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 1999లో పశువులకు దగ్గరగా ఉండే రైతులు, ఇతరుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో 300 పందులు పాక్షికంగా ఈ వైరస్ బారిన పడగా.. వంద మందికి పైగా మరణించారు. మొత్తం 265 మందికి ఈ వైరస్ సోకగా.. 40 శాతం మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా పది లక్షల పందులను చంపేశారు.

ఆ పేరు ఎలా వచ్చింది

ఈ వైరస్‌ను మొదటగా మలేషియాలో గుర్తించారు. అక్కడి సుంగాయ్ నిపా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిపా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. మలేషియా నుంచి 2001లో ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్‌కు పాకింది. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు.


వ్యాధి లక్షణాలు

ఈ నిపా వైరస్ ముదరడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మెదడులో వాపు మొదలవుతుంది. ప్రస్తుతం కేరళలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరికొన్ని లక్షణాలు కూడా గుర్తించారు. జ్వరం, సడెన్‌గా శ్వాస ఆడకపోవడం, లో బీపీతో ఈ పేషెంట్లను వెంటిలేటర్లపై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన వారికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిపాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారు.

ఎలా సోకుతుంది?

ఈ నిపా వైరస్ ఓ జూనోటిక్ వైరస్. అంటే ఇది మనుషులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని డాక్టర్లు చెబుతున్నారు. గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పారు.