పార్టీ మార్పుపై హరీశ్ రావు క్లారిటీ

252
harish-rao-gives-clarity-his-party-changing

గత కొద్దిరోజులుగా మంత్రి హరీశ్ రావు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారని పెద్దఎత్తున వార్తలు, సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు మంత్రి హరీశ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. “నా పుట్టుక టీఆర్ఎస్‌లోనే.. నా చావు టీఆర్ఎస్‌లోనే. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటే నా బాట. రాజకీయ లబ్ధికోసమే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కలలో కూడా ఇలాంటి ఆలోచన గానీ, ఊహ గానీ చేయను. మేము ఉద్యమాల నుంచి వచ్చినవాళ్ళం. త్యాగాల నుంచి వచ్చినవాళ్ళం. గడ్డిపోచల్లాగా కేసీఆర్ మాట మీద రాజీనామాలు చేసినవాళ్ళం. మంత్రి పదవులకు రాజీనామా చేశాం. రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఉద్యమ సమయంలో జైళ్లకు పోయినటువంటి వాళ్ళం” అని హరీశ్ రావు తేల్చిచెప్పేశారు.



 

తమకు త్యాగాలు తెలుసు తప్ప.. ద్రోహాలు తెలియని.. ద్రోహాలు చేసే పార్టీ టీఆర్ఎస్ కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తమది అలాంటి కుటుంబం అంతకంటే కాదన్నారు. ఒక వేళ అటువంటి ఆలోచన ఉండే వాళ్ళు పార్టీ నుంచి విరమించుకోవాలని హరీశ్ సూచించారు. ఇకపై పిచ్చి ప్రేలాపనలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో చట్ట పరమైన చర్యలకు సిద్ధపడాలని మంత్రి హెచ్చరించారు.