
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
ఈ విద్యా సంవత్సరం 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులు పాఠశాలకు హాజరై పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 8వ తరగతిపైన చదివేవారికి మాత్రమే ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
మిగతా విద్యార్థులందరికీ ఆన్ లైన్ మాధ్యమంగానే ఎగ్జామ్స్ పెట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిపింది.
2020-2021 విద్యా సంవత్సరానికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని కరోనా వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ విద్యా శాఖ అదనపు డైరెక్టర్ రీతా శర్మ అన్నారు.
ప్రాధమిక, మాధ్యమిక స్థాయిలో ఇంతవరకూ ఒక్క క్లాస్ కూడా ప్రత్యక్షంగా సాగలేదని గుర్తు చేసింది.
ఈ సంవత్సరం 3 నుంచి 8వ తరగతి వరకూ సబ్జెక్టుల వారీగా ఆన్ లైన్ అసెస్ మెంట్ జరుగుతుందని వెల్లడించారు. వర్క్ షీట్స్ ఆధారంగా మార్కులను కేటాయిస్తామని తెలిపారు.