తెలుగమ్మాయికి దక్కిన ఘనత … మిస్ టీన్ ఇండియా వరల్డ్‌ వైడ్ టైటిల్

312
miss teen world

అందాల పోటీల్లో తెలుగు అందం మెరిసింది. ప్రవాస భారతీయుల్లో ఎవరు అందాల సుందరి అనే పోటీల్లో తెలుగు ఆణిముత్యానికి కిరీటం దక్కింది. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు ముంబైలో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 పోటీల్లో ఈషా కోడె టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి వలస వెళ్లి వివిధ దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయుల్లోని యుక్త వయస్సు యువతుల మధ్య ఈ పోటీ జరిగింది.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఓమెన్, ఫిజి, మారిషస్, మలేషియా, సింగపూర్, హంగేరి, గునియా, జర్మనీ, సురనమ్, కెన్యా, గ్వాండ్, కోస్టారికా, ఐర్లాండ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయ యువతులు 39 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో ఏడుగురు మిస్ టీన్ వరల్డ్ వైడ్ కంటెస్టంట్లు ఉన్నారు. వీరిలో ఈషా కోడె ఒకరు. ఐదు రోజుల పాటు వీరి మధ్య జరిగిన పోటీల్లో ఈషా కోడె విజేతగా నిలిచి మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 టైటిల్ దక్కించుకుంది.

ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మొదటి మూడు రోజులు ఈవినింగ్ గౌన్ కాంపిటీషన్ జరిగింది. సెప్టెంబర్ 7వ తేదీన ఫైనల్ పోటీలు జరిగాయి. పోటీకి వచ్చిన వారిలో టాప్ 10, టాప్ 7, టాప్ 4 కేటగిరీలుగా విభజించి వారికి క్వశ్చన్ అండ్ అన్సర్ రౌండ్ నిర్వహించారు. ఇందులో వారి ప్రతిభను పరీక్షించి ప్రతి కేటగిరి నుంచి ఒక్కరిని ఫైనల్‌గా టాప్ త్రీకి సెలక్ట్ చేశారు. ఆ తర్వాత వీరి మధ్య కూడా పోటీలు పెట్టారు.

పద్మావతి సినిమాలోని దీపికా పదుకొనే పాట “నయనో వాలే” కు ఈషా కోడె నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. నిరాశ, ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో నడిచేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా దీపికా పదుకునే చేస్తున్న కృషి తనకు స్ఫూర్తినిచ్చిందని అందుకనే ఆమె పాటను తాను ఎంచుకున్నానని ఈషా ఈ సందర్భంగా పేర్కొంది.

భవిష్యత్తులో ఇలాంటి హ్యాపీ2 థ్రైవ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈషా తెలిపింది. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేసింది. పిడియాట్రిక్ కార్డియక్ సర్జన్ కావాలనేది తన లక్ష్యమని చెప్పింది. ఈషాకు భారతీయతపై మక్కువ, సేవాభావంపై ఉన్న నిబద్ధత కూడా అనుకూలంగా మారడంతో మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 కిరీటం ఆమె సొంతమైంది.

ఈషా కోడె మన అచ్చతెలుగమ్మాయి. 90వ దశకంలో ఈషా కుటుంబం తెలుగు నేల నుంచి అమెరికాకు వలస వెళ్లింది. చిన్నప్పటి నుంచి మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, మానవత్వ విలువలను తెలియజేస్తూ ఆమె తల్లిదండ్రులు ఈషాను పెంచారు. ఇదే ఈనాడు ఆమె ఉన్నతికి దోహదపడింది.