![Medaram Jathara Positive cases at Medaram Mini Fair](https://telugu.teenmaar.news/wp-content/uploads/2021/02/Medaram-Jathara.jpg)
అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర నేడు సాంప్రదాయబద్దంగా ప్రారంభమైంది.
తెలంగాణలో ప్రతి రెండేళ్లకు మేడారం జాతర వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత వచ్చే ఏడాది మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు.
ఈ జాతరకు వివిద రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటారు. అనావాయితీ ప్రకారం అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తారు.
ఒగ్గు పూజారుల జగ్గు చప్పుళ్లతో శివశత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.
ఈసారి 20 లక్షలమందికిపైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. వనదేవత దర్శనానికి భక్తులు ఇప్పటికే ఆలయం వద్ద బారులు తీరారు.
భక్తులతో గద్దెల ప్రాంతం, జంపన్న వాగు కొత్త కళను సంతరించుకున్నాయి. మేడారం మినీ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.52 కోట్లు వెచ్చించింది.
భక్తుల స్నానాల కోసం జంపన్నవాగులో నల్లాలు అమర్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు.తాగునీటి కోసం పది మినీ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.