ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా జర భద్రం…!

256

బిర్యానీని ఆర్డర్‌ చేసిన యువతికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. చెన్నై సౌకార్‌పేటకు చెందిన ప్రియా అగర్వాల్‌ (21) బుధవారం ఉదయం ఉబర్‌ ఈట్స్‌ కంపెనీకి ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసింది. బిర్యానీ ధర రూ.76 ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించింది. బిర్యానీ రాలేదు సరికదా రూ.40 వేలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్‌ ఈట్స్‌ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆర్డర్‌ క్యాన్సిల్‌ కావడంతో ఉబర్‌ ఈట్స్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయగా.. మీరు చెల్లించిన రూ.76 తిరిగి పొందాలంటే ముందుగా రూ.5 వేలు చెల్లించండి, మేము రూ.5,076 మీ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వారు చెప్పిన ప్రకారమే రూ.5 వేలు చెల్లించినా డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మరలా కాల్‌ సెంటర్‌ను సంప్రదించగా మరోసారి రూ.5 వేలు చెల్లించండని చెప్పారు. ఇలా 8 సార్లు రూ.5 వేల లెక్కన మొత్తం రూ.40 వేలు చెల్లించింది. అయితే ఆమె రూ.76తో పాటూ రూ.40 వేలను కూడా కోల్పోయింది. తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన ప్రియా అగర్వాల్‌ చెన్నై వడపళని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సైబర్‌ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.