ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పాదయాత్ర

331

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలనే డిమాండ్‌తో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్‌వీ నాయకుడు బీటెక్‌ తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కన్యాకుమారిలో ఈ పాదయాత్రను ప్రారంభిస్తానని తెలిపారు. దాదాపు 3,500 కిలోమీటర్ల మేర 5 నెలలపాటు కొనసాగనున్నఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుందని, పాదయాత్ర హైదరాబాద్‌కు చేరిన తర్వాత సీఎం కేసీఆర్‌ను కలుసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ నామకోటి పుస్తకాలను ఆయనకు అందజేస్తానని తెలిపారు .

ఈ పాదయాత్రలో సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన తీరు, రాష్ట్రంలో ఉత్తమ పాలనను అందించడం ద్వారా నంబర్‌ 1 ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన అంశాలతోపాటు ఆయన అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. బీటెక్‌ తేజతోపాటు నాంపల్లికి చెందిన ఏ ధర్మతేజ, అబిడ్స్‌ ఎస్సీ హాస్టల్‌కు చెందిన సీహెచ్‌ సాయికుమార్‌, పవన్‌, గణేశ్‌ పాదయాత్రలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.