ఆ ఎంపి .. కరుణానిధి అక్రమ సంతానమే : బీజేపీ నేత రాజా

366
bjp-leader-h-raja-calls-kanimozhi-as-illegitimate-child-of-karunanidhi

బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళిని ఓ అక్రమ సంతానంగా అభివర్ణిస్తూ ఆయన తమిళంలో చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతున్నది. తమిళనాడు గవర్నర్ ఓ జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ కనిమొళి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజా ఈ ట్వీట్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కాకుండా పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం ఏంటి అంటూ నిలదీసిన అన్నామలై యూనివర్సిటీ విద్యార్థి ఉదయ్‌కుమార్‌ను హత్య చేసిన కుటుంబం ఇప్పుడు దీనిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని ఓ ట్వీట్‌లో రాజా అన్నారు.



ఆ తర్వాత గవర్నర్‌ను ఆ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ మరో ట్వీట్‌లో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధం ద్వారా వచ్చిన తన అక్రమ సంతానాన్ని ఎంపీని చేసిన ఆ నేతను ఇదే ప్రశ్న జర్నలిస్టులు అడుగుతారా? అడగలేరు.. ఎందుకంటే వాళ్లు భయపడతారు. చిదంబరం ఉదయ్‌కుమార్, అన్నానగర్ రమేష్, పెరంబలూర్ సాదిక్ బాషాలను ఏం చేశారో వాళ్లకు తెలుసు అని రాజా ఆ ట్వీట్‌లో రాశారు.



రాజా ఈ ట్వీట్‌లో ప్రస్తావించిన ముగ్గురినీ కరుణానిధి, ఆయన కుటుంబం హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మహిళా జర్నలిస్ట్‌తో అలా ప్రవర్తించడం సరికాదని కనిమొళి మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనిని తప్పుబడుతూ రాజా చేసిన ట్వీట్ మరింత దుమారం రేపింది. ఆయన కామెంట్స్‌ను ట్విట్టర్‌లో చీల్చి చెండాడుతున్నారు నెటిజన్లు.